DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలోని హనుమాన్ నగర్లో ఉన్న శ్రీ బాలాజీ విద్యానికేతన్ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం, ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన వల్ల ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడిన ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని SFI జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న చరణ్, అరవింద్ అనే విద్యార్థులు తరగతి గదిలో పైకప్పు పెచ్చులూడి తలపై పడడంతో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ ఘటన పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడ్ ఫ్రైడే పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నప్పటికీ, పాఠశాలకు సెలవు ఇవ్వకుండా నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహించడం చాలా తీవ్రమైన తప్పిదమని పేర్కొన్నారు. ఇలాంటి బాధ్యతారాహిత్య వైఖరి విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదం కలిగిస్తోందని అన్నారు. గాయపడిన విద్యార్థులకు అత్యుత్తమ వైద్యం అందించాలని, వారి కుటుంబాలకు పూర్తి సహాయం చేయాలని పాఠశాల యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఈ ఘటనపై వెంటనే స్పందించి, సంబంధిత పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో SFI పట్టణ అధ్యక్షుడు సంజయ్, కార్యదర్శి శశిధర్ పాల్గొన్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోకపోతే, SFI ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
Admin
DNB News