DNB News - ఆంధ్రప్రదేశ్ / : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న వారోత్సవాలను కర్నూలు అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్త పర్యవేక్షణలో, కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ , కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఆదివారం ఈ వారోత్సవాలు ప్రారంభించినట్లు తెలిపారు. మార్చి 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా సాధికారత, మహిళల భద్రతపై అవగాహన కల్పించేందుకు మహిళా పోలీసు విభాగం ఆధ్వర్యంలో ర్యాలీలు మరియు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వారాంతర కార్యక్రమాలలో భాగంగా విద్యార్థులు, మహిళలతో కలిసి మహిళా సాధికారత, భద్రత అంశాలపై అవగాహన ర్యాలీలు, అవగాహన సదస్సులు, పెయింటింగ్, డ్రాయింగ్, వక్తృత్వ, వ్యాసరచన పోటీలు, హెల్త్ క్యాంపులు, ఓపెన్ హౌస్ కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, బ్యాండ్ షోలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. మహిళలు, విద్యార్థులు, చిన్నారులు ఉన్నత లక్ష్యాలు పెట్టుకుని చదువులో ముందుకు సాగాలని సూచించారు. మహిళల పట్టుదల, ఆత్మవిశ్వాసం సమాజ ప్రగతికి బలమైన పునాది అని పేర్కొన్నారు. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే సమీప పోలీస్ స్టేషన్ను లేదా డయల్ 112, చైల్డ్ లైన్ 1098, సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ అవగాహన ర్యాలీ కర్నూలులోని కొండా రెడ్డి బురుజు వద్ద ప్రారంభమై కోల్స్ కళాశాల మీదుగా పాత కంట్రోల్ రూమ్ వరకు, అక్కడి నుండి తిరిగి జిల్లా పోలీసు కార్యాలయం వరకు కొనసాగింది. “ఆకతాయిల ఆట కట్టిస్తాం – తిరుగుబోతుల తాట తీస్తాం”, “ఒంటరిగా ప్రయాణిస్తున్నారా? శక్తి యాప్ ఉపయోగించండి” వంటి నినాదాలతో ఫ్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, మహిళా పోలీస్ స్టేషన్ సీఐలు రామయ్య నాయుడు, విజయలక్ష్మి, పట్టణ సీఐలు పార్థసారథి, నాగరాజా రావు, మన్సురుద్దీన్, ఆర్ఐలు నారాయణ, జావేద్, ఆర్ఎస్ఐలు, శక్తి టీం మహిళా పోలీసులు, సచివాలయ పోలీసులు, శ్రీలక్ష్మి, చైతన్య, కెవిఆర్ కళాశాల, సిరాక్ స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News