DNB News - ఆంధ్రప్రదేశ్ / : మాదకద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన “ఆపరేషన్ వజ్రప్రహార్”లో భాగంగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా శనివారం మెగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు, ఈగల్ ఐజి ఏకే రవి కృష్ణ పర్యవేక్షణలో, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో అన్ని పోలీసు సబ్ డివిజన్లలో ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా మరియు సంబంధిత నేరాలను అరికట్టడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు సహా మొత్తం 158 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. డ్రోన్ కెమెరాల సహాయంతో అనుమానాస్పద కదలికలను పర్యవేక్షిస్తూ విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో భాగంగా మొత్తం 600 మంది వ్యక్తులను, 193 వాహనాలను పరిశీలించారు. సరైన పత్రాలు లేని 69 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పత్తికొండ సబ్ డివిజన్లోని ఆలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బైండ్ ఓవర్ కేసు నమోదు చేశారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక మరియు చట్టపరమైన దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, కుటుంబ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని పోలీసులు వివరించారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజలతో కలిసి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. సమాజాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడంలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ డిఎస్పీ వెంకట్రామయ్య, ఎమ్మిగనూరు డిఎస్పీ భార్గవి, సిఐలు, ఈగల్ టీం ఎస్సై సుజన్ కుమార్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
DNB News