DNB News - ఆంధ్రప్రదేశ్ / : నదులను కాపాడటం ప్రతి పౌరుని కర్తవ్యమని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి పేర్కొన్నారు. శనివారం వినాయక ఘాట్ సమీపంలో KC Canal లో కొనసాగుతున్న శుభ్రత పనులను నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్తో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పౌరుల బాధ్యతాయుత సహకారంతోనే నదుల సంరక్షణ ఫలప్రదమవుతుందని తెలిపారు. కెనాల్ పరిసర ప్రాంతాల్లో చెత్త పారవేయడాన్ని పూర్తిగా నిరోధించేందుకు మున్సిపల్ శానిటేషన్, జలవనరుల శాఖ సిబ్బంది ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. దెబ్బతిన్న రక్షణ వలయాలను తక్షణమే పునరుద్ధరించాలని, కెనాల్లోకి మురుగునీరు చేరుతున్న ప్రదేశాలను గుర్తించి వాటి మళ్లింపుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. నగర నడిబొడ్డున ప్రవహించే కెనాల్ నగర సౌందర్యానికి ప్రతీకగా నిలవాలని, అయితే నిర్లక్ష్యం కారణంగా అపరిశుభ్రత నెలకొనడం విచారకరమని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. నీటి ప్రవాహం తగ్గిన సమయంలో దుర్వాసనలు, దోమల ప్రబలత వంటి సమస్యలు పెరిగి ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్నాయని పేర్కొన్నారు. రక్షణ కంచెలను ధ్వంసం చేసి వ్యర్థాలు పారవేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. కెనాల్ శుభ్రత, సంరక్షణ కోసం ప్రజాధనం వినియోగమవుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, ప్రజలు చెత్తను మున్సిపల్ వాహనాలకే అప్పగించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నాగరాజు, ప్రజారోగ్య అధికారి డా. నాగ ప్రసాద్ బాబు, డిఈఈ పవన్ కుమార్ రెడ్డి, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు ఆర్. రాజు, నాగేశ్వరరావు, మల్లికార్జున, కోఆర్డినేటర్లు జయకృష్ణ, శ్రీనివాస్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News