DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాయలసీమ విశ్వవిద్యాలయంలో కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ల 95వ వర్ధంతి సందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు కె. భాస్కర్, జిల్లా ఉపాధ్యక్షులు రమణ కుమార్ పాల్గొన్నారు. ముందుగా అమర వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సామ్యవాదం, లౌకికవాదం, సమసమాజ స్థాపన కోసం వారు కలలు కనారని, వారి ఆశయాలు నేటి యువతకు మార్గదర్శకమని అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా యుక్త వయస్సులోనే ప్రాణత్యాగం చేసిన వీరుల సాహసం అపూర్వమని కొనియాడారు. నేటి యువత మాదక ద్రవ్యాలకు బానిసలవుతూ సామాజిక సమస్యలపై స్పందన కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే శక్తులపై యువత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయంగా జరుగుతున్న యుద్ధ చర్యలను ఖండిస్తూ నిరపరాధ ప్రజలపై దాడులు తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు వ్యవసాయ రంగానికి హానికరమని విమర్శించారు. యూజీసీ 2026 ముసాయిదాను అమలు చేయాలని, సుప్రీంకోర్టు స్టేను ఎత్తివేయాలని కోరారు. రాష్ట్రంలో యూనివర్సిటీల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి, ఖాళీగా ఉన్న 4200 ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ను విమర్శిస్తూ, అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న లక్షకు పైగా పోస్టులను భర్తీ చేయాలని అన్నారు. భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే యువత మతోన్మాద, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ నాయకులు సుధాకర్, సాయి, పవన్, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News