DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని జిల్లా సమస్యను పక్కనపెట్టి పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడుతున్నారని పాలక, ప్రతిపక్ష నాయకులపై ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదోని జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు సోమవారం 163వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు దీక్షలో రామాంజనేయులు, వై. యాంకోబా, అనువాల పాండురంగ, రామకృష్ణ, బసాపురం మల్లయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు దాసరి గోవిందురాజులు, సుజ్ఞానమ్మ మాట్లాడుతూ, ఆదోని కూటమి ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి అసెంబ్లీలో ఆదోని జిల్లా అంశంపై మాట్లాడినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే 163 రోజులుగా కొనసాగుతున్న దీక్షల నేపథ్యంలో ఇప్పటికీ స్పష్టమైన హామీ రాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పార్థసారథి చొరవ తీసుకుంటే కేంద్ర, రాష్ట్ర స్థాయిలో హామీ తీసుకురావడం సాధ్యమేనని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి ఆదోని జిల్లాపై స్పష్టమైన ప్రకటన తీసుకురావాలని డిమాండ్ చేశారు. గత 70 ఏళ్లుగా ఆదోని అభివృద్ధి చెందకపోవడంతో ప్రజలు మార్పు కోసం కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టాలని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పగడాల కోదండ, వైపీ నాగరాజు, బండారి హనుమంతు, గుమ్మల బాలస్వామి, మాదాసు జగన్, దాసరి నరేష్, బీఎస్పీ రామలింగయ్య తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News