DNB News - ఆంధ్రప్రదేశ్ / : నగరపాలక సంస్థలో పనిచేసే ఉద్యోగులు విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించినా, క్రమశిక్షణ పాటించకపోయినా కఠిన చర్యలు తప్పవని కమిషనర్ చల్లా ఓబులేసు హెచ్చరించారు. శుక్రవారం ఆయన 14వ శానిటేషన్ మస్టర్ను తనిఖీ చేసి అనంతరం నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. చెన్నమ్మ సర్కిల్, బళ్లారి చౌరస్తా, వాణిజ్య నగర్ ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్కు కొంతమంది సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం చేస్తున్నట్లు కనిపించింది. ఒక కార్మికుడు హాజరు వేసుకుని ఇంటికి వెళ్లగా, మరొకరు మొబైల్ ఫోన్లో కాలక్షేపం చేస్తూ కనిపించడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు గైర్హాజరైన ఉద్యోగి జీతం కట్ చేయాలని ఆదేశించారు. విధి సమయంలో మొబైల్ ఫోన్లతో కాలక్షేపం చేయడం, హాజరు వేసుకుని ఇంటికి వెళ్లడం వంటి చర్యలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. పిన్ పాయింట్ ప్రోగ్రామ్ను కచ్చితంగా అమలు చేసి ప్రతి వీధి పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. నగర పారిశుద్ధ్యంపై రాజీ పడబోమని పేర్కొన్నారు. అనంతరం పరిమళ నగర్లోని అన్న క్యాంటీన్ను పరిశీలించిన కమిషనర్ అక్కడి స్వచ్ఛత, తాగునీటి సరఫరా, భోజన నాణ్యత వంటి అంశాలను తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న సేవల్లో ఎలాంటి లోపం లేకుండా చూడాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. నగరపాలక కార్యాలయంలో ప్రజలకు కల్పించనున్న వసతులను కూడా ఆయన పరిశీలించారు. తన ఆదేశాల మేరకు కార్యాలయంలో కుర్చీలు, వాటర్ కూలర్, హెల్ప్ డెస్క్, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడం కార్పొరేషన్ బాధ్యత అని పేర్కొన్నారు. అదేవిధంగా వెండర్ జోన్ల ఏర్పాటుకు వెంకటరమణ కాలనీలోని హరిత హోటల్ వెనుక ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాషా, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు మునిస్వామి, కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News