DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్న 52 ఎన్నికల వార్డులను 68 వార్డులుగా పునర్విభజన చేయడానికి సంబంధించి ప్రతిపాదిత ముసాయిదాను నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు సోమవారం విడుదల చేశారు. కమిషనర్ క్యాంపు కార్యాలయంలో పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి ముసాయిదా ప్రతులను ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 24న జారీ చేసిన జీవో నెం.65 ప్రకారం వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం నగర జనాభా 4,77,718గా ఉండగా, భౌగోళిక పరిస్థితులు, పరిపాలనా సౌలభ్యం, స్థానిక అవసరాలను పరిగణనలోకి తీసుకొని ముసాయిదా రూపొందించినట్లు చెప్పారు. ప్రతిపాదిత ముసాయిదాలో కర్నూలు నియోజకవర్గానికి 42 వార్డులు, పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు అర్బన్ పరిధికి 22 వార్డులు, కోడుమూరు నియోజకవర్గ పరిధికి 4 వార్డులు కేటాయించినట్లు వెల్లడించారు. వార్డుల సరిహద్దులతో కూడిన ముసాయిదాను నగరపాలక సంస్థ కార్యాలయం, కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయాలు, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల నోటీసు బోర్డులపై ప్రదర్శించినట్లు తెలిపారు. ముసాయిదాపై ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు తమ సూచనలు, సలహాలు, అభ్యంతరాలను ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగానికి వ్రాతపూర్వకంగా సమర్పించాలని కమిషనర్ కోరారు. ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకంగా తుది వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జీ సిటీ ప్లానర్ వై.వి. వెంకటరమణ, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, సూపరింటెండెంట్ సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News