DNB News - ఆంధ్రప్రదేశ్ / : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్స్ను తక్షణమే రద్దు చేసి, పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 12వ తేదీన జరగనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ఆదోని పట్టణంలోని రెవెన్యూ భవన్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పీఎస్ గోపాల్, బి. వెంకన్న, జి.ఎం.కప్ప అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి. అంజిబాబు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కే. అజయ్ బాబు, ఐఎన్టీయూ నాయకులు దేవి శెట్టి ప్రకాష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కే. వెంకటేశులు, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి మల్లికార్జున తదితరులు పాల్గొని ప్రసంగించారు. వారు మాట్లాడుతూ అంగన్వాడీ, ఆశా, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా చేయాలని డిమాండ్ చేశారు. రవాణా రంగం, హమాలీ కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు జీవన భద్రత కల్పించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటు పెట్టుబడుల ఉపసంహరణను తక్షణమే నిలిపివేయాలని, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మికులకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని కోరారు. ఈ డిమాండ్స్ సాధనకై దేశవ్యాప్తంగా 12వ తేదీన జరగనున్న సమ్మెలో ఉద్యోగులు, కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొని ఐక్యంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు సంజయ్, డిఎస్ఎఫ్ నాయకులు ఉదయ్, సిఐటియు నాయకులు తిప్పన, లక్ష్మన్న, హనుమంతు, కృష్ణమూర్తి, ఏఐటీయూసీ నాయకులు ఓబి నాగరాజు, బి. రాజు, భీమేష్, గంగన్న, ఐఎఫ్టీయూ నాయకులు నరసన్న తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News