DNB News - ఆంధ్రప్రదేశ్ / NTR DIST : నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, నేరస్థుల గుర్తింపులో ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు, హత్యలు, ప్రాపర్టీ, చీటింగ్, రోడ్డు ప్రమాదాల కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కేసుల పరిష్కారానికి అవసరమైన సూచనలు, సలహాలు అందించారు. మహిళల భద్రతకు గట్టి చర్యలు తీసుకోవాలని, ప్రతిరోజూ కనీసం రెండు గ్రామాల్లో పర్యటించి ప్రజలతో నేరుగా మమేకమవాలని ఆదేశించారు. సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ సచివాలయ గ్రామ–వార్డు మహిళా పోలీసులతో సమన్వయంతో పని చేయాలని తెలిపారు. దొంగతనాలు, ప్రాపర్టీ కేసులు చేధించి రికవరీలు పెంచాలని, దర్యాప్తులను పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. కేసుల దర్యాప్తులో నాట్ గ్రిడ్ సాంకేతికతను వినియోగించాలని సూచించారు. పోక్సో కేసుల్లో తప్పనిసరిగా 60 రోజులలోపు ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని, అలసత్వం వహిస్తే ఛార్జ్ మెమోలు జారీ చేస్తామని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ పై స్పెషల్ డ్రైవ్ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిస్సింగ్, చీటింగ్, రోడ్డు ప్రమాదాలు, ఎస్సీ–ఎస్టీ, ప్రాపర్టీ కేసులపై సమీక్ష నిర్వహించి, కోర్టుల్లో పెండింగ్ కేసులు త్వరగా ట్రయల్కు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్ పెంచి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని తెలిపారు. గత నెలలో ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ గారు ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డీఎస్పీలు బాబు ప్రసాద్, వెంకట్రామయ్య, దుర్గా ప్రసాద్, హేమలత, భార్గవి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
Admin
DNB News