DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వెల్దుర్తి మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకులంలో నిర్వహించిన "నెట్ జీరో హెల్దీ క్యాంపస్" కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, పత్తికొండ ఎమ్మెల్యే కే.ఈ. శ్యాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే కలిసి మామిడి, నేరేడు మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని వారు సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో మొక్కల పెంపకం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామాలు, పట్టణాల్లో విస్తృత స్థాయిలో మొక్కలు నాటి హరిత వాతావరణాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, గురుకుల సిబ్బంది, ఉపాధి హామీ శ్రామికులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Admin
DNB News