DNB News - ఆంధ్రప్రదేశ్ / : అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం స్థానిక సి.ఆర్ భవనంలో నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి. వలరాజు, జిల్లా నిర్మాణ బాధ్యులు బి. గిడ్డయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన జి. వలరాజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రభుత్వ విద్యను పరిరక్షించే బాధ్యతను విస్మరించి, విద్యా వ్యవస్థను క్రమంగా నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ హామీలను కూడా పక్కనబెట్టి ఉన్నత విద్యను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధంగా చర్యలు తీసుకుంటోందని విమర్శించారు. ఏపీఎస్సిహెచ్ఈ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా నిబంధనలకు విరుద్ధంగా సి.హెచ్.ఈ జి.ఓ నెంబర్ 3 తీసుకువచ్చారని ఆయన తెలిపారు. మరోవైపు, ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రైవేట్ కళాశాలలు తప్పుడు ప్రకటనలు చేయవద్దని ఆదేశించినా, అవి ఎక్కడా అమలు కావడం లేదని, అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని అన్నారు. నకిలీ కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, వాస్తవంగా విద్యార్థులు, తల్లిదండ్రులను మభ్యపెట్టేందుకు మాత్రమే ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. బైజూస్, ఫిజిక్స్ వాలా వంటి సంస్థలు అనుమతి లేకుండా కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తూ విద్యార్థులను దోచుకుంటున్నప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఇంటర్మీడియట్ విద్యలో కార్పొరేట్ కాలేజీలలో ఉన్న ఫెయిల్ శాతాన్ని గోప్యంగా ఉంచుతున్నారని, అక్రమ అడ్మిషన్లు, పుస్తకాల పేరుతో అధిక వసూళ్లు జరుగుతున్నాయని చెప్పారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కార్పొరేట్ విద్యకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంలో ఆలస్యం జరుగుతోందని, ప్రకటించిన ₹1200 కోట్లు కూడా పూర్తిగా విడుదల కాలేదని, దీని వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి విద్యా వ్యాపారానికి వ్యతిరేకంగా సమరశీ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమన్న, కార్యదర్శి ఎస్. షాబిర్ భాష, ఆఫీస్ బేరర్స్ శరత్ కుమార్, వీరేష్, నగర కార్యదర్శి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News