DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నూతనంగా జూనియర్ సివిల్ జడ్జి (JCJ)గా ఎంపికైన మహమ్మద్ అజామ్, కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల వెలువడిన ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీసెస్ ఫలితాలలో ప్రతిభ కనబరిచి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన అజామ్ను ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కృషి, పట్టుదలతో సాధించిన ఈ విజయాన్ని ప్రశంసిస్తూ, న్యాయవ్యవస్థలో ప్రజలకు న్యాయం అందించే దిశగా సేవలు అందించాలని సూచించారు. తండ్రి పోలీస్ శాఖలో సేవలందిస్తుండగా, కుమారుడు న్యాయవ్యవస్థలో ప్రతిష్టాత్మక స్థానం పొందడం గర్వకారణమని కొనియాడారు. ఇది సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహమ్మద్ అజామ్ నేపథ్యం: కర్నూలు రూరల్ మండలం బి. తాండ్రపాడు గ్రామానికి చెందిన మహమ్మద్ అజామ్, కర్నూలు జోనల్ ఇంటెలిజెన్స్ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న అల్లాబకాష్, షేకూన్ దంపతుల కుమారుడు. విద్యార్హతలు: ప్రాథమిక విద్యను కర్నూలులోనే పూర్తి చేసిన అజామ్, హైదరాబాద్లోని పెండేకంటి లా కాలేజీలో ఎల్.ఎల్.బి (LLB), విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో ఎల్.ఎల్.ఎమ్ (LLM) పూర్తి చేశారు. 2025 నోటిఫికేషన్లో హైకోర్టు నిర్వహించిన రాత పరీక్షలు మరియు ఇంటర్వ్యూలలో ప్రతిభ కనబరిచి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై విజయాన్ని సాధించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది మహమ్మద్ అజామ్కు శుభాకాంక్షలు తెలిపారు.
Admin
DNB News