DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాజకీయాల కోసం దేవుడిని వాడుకోవడం కూటమి ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచన అని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. సోమవారం మండల పరిధిలోని రాంపురం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల ప్రసాదం లడ్డూ తయారీలో వాడే నేయిలో జంతు కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు మాంసం కలిసిందని కూటమి నాయకులు తప్పుడు ఆరోపణలు చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలను వెంటనే మానుకోవాలని హెచ్చరించారు. దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థలైన NRDI, NDDB ల్యాబ్లు ఎలాంటి కల్తీ జరగలేదని స్పష్టం చేసినా కూడా కూటమి నాయకులు అబద్ధాల రాజకీయాలు కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంపై స్వామివారి భక్తులు కూటమి నాయకులపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ప్రజల దృష్టిలో పూర్తిగా నమ్మకం కోల్పోయిన చంద్రబాబు నాయుడు తన అబద్ధాలను నిజాలుగా చూపించేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగా కుట్ర రాజకీయాలకు తెరలేపారని మండిపడ్డారు. ప్రజలకు, స్వామివారి భక్తులకు క్షమాపణ చెప్పాల్సిన చంద్రబాబు నాయుడు, సుప్రీంకోర్టు ఆదేశాలతో జరిగిన దర్యాప్తును సైతం తప్పుపట్టడం, ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు చేయడం, ఇళ్లను తగలబెట్టడం అత్యంత దారుణమని అన్నారు. చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ప్రజలకు, శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి డిమాండ్ చేశారు.
Admin
DNB News