DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ కొరతపై భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితులను సీపీఎం తీవ్రంగా ఖండించింది. సోమవారం కర్నూలు నగరంలోని ఇందిరా గాంధీ నగర్లో ఉన్న సుందరయ్య భవన్లోని సీపీఎం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.ఎస్. రాధాకృష్ణ, ఎం.డి. ఆనంద్ బాబు, టి. రాముడు మాట్లాడారు. జిల్లాలో అనేక పెట్రోల్ బంకుల వద్ద సరఫరా నిలిచిపోవడం, భారీ క్యూలు ఏర్పడడం, అధిక ధరలు వసూలు చేయడం వంటి ఘటనలు జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. ఈ కొరత సహజం కాదని, కొందరు వ్యాపార వర్గాలు లాభాపేక్షతో కృత్రిమంగా సృష్టిస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఈ పరిస్థితి వల్ల సాధారణ ప్రజలు, రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రోజువారీ కార్యకలాపాలు స్తంభించిపోతున్నాయని అన్నారు. అత్యవసర సేవలపై కూడా ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ ఏడు రోజులకు సరిపడా సుమారు 13.5 లక్షల లీటర్ల ఇంధన నిల్వలు ఉన్నాయని ప్రకటించగా, ప్రస్తుతం బంకులు మూతపడడం పరిస్థితి మరింత అనుమానాలకు దారి తీస్తోందన్నారు. మరోవైపు సమస్య లేదని మంత్రి చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేనని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని సీపీఎం డిమాండ్ చేసింది. పెట్రోల్, డీజిల్ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలి కృత్రిమ కొరత సృష్టిస్తున్న డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి ధరల నియంత్రణను కట్టుదిట్టంగా అమలు చేయాలి నిల్వలు, సరఫరాపై ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేయాలి సరఫరా వివరాలను పారదర్శకంగా ప్రజలకు వెల్లడించాలి ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే ప్రజలతో కలిసి సీపీఎం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని నాయకులు హెచ్చరించారు.
Admin
DNB News