DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని శ్రీ కోతులాబావి ఆంజనేయస్వామి ఆలయ ప్రహరీ వ్యవహారానికి సంబంధించి తనపై జరిగిన అరెస్ట్ పూర్తిగా అక్రమమని మాజీ కౌన్సిలర్ కోనేరు నాగేంద్ర ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రెస్నోట్లో పలు సంచలన ఆరోపణలు చేశారు. ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్న “శ్రీ హనుమ కరసేవ” కార్యక్రమం సందర్భంగా అదే రోజు ఉదయం 5:30 గంటలకు ఎమ్మిగనూరు సీఐ కంబగిరి రాముడు తన సిబ్బందితో కలిసి తనను అరెస్ట్ చేశారని తెలిపారు. అరెస్ట్ అనంతరం గౌరవ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా నేరుగా జైలుకు తరలించారని, ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఆదోని సబ్ జైలు అధికారులకు తాను ఈ విషయాన్ని వివరించినప్పటికీ తనను కర్నూలు జిల్లా జైలుకు తరలించారని చెప్పారు. అక్కడి జైలు ఉన్నతాధికారులు FIR, ఫిర్యాదు, కోర్టు ఆదేశాలు లేకుండా కేవలం బైండోవర్ కేసు ఆధారంగా ఎమ్మిగనూరు తహసీల్దార్ శ్రీనివాసులు ఆరు నెలల శిక్ష విధించడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారని తెలిపారు. జైలు అధికారుల సూచనల మేరకు తన న్యాయవాదులు చర్యలు తీసుకోవడంతో మూడో రోజుకే విడుదలైనట్లు పేర్కొన్నారు. ఒక రాజకీయ నాయకుడిని సంతోషపెట్టేందుకు కోతులాబావి వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని తనపై కుట్రపూరితంగా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని ఆరోపించారు. “FIR లేకుండా, రిమాండ్ రిపోర్ట్ లేకుండా, మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచకుండా జైలు శిక్ష విధించడం దేశంలో ఎక్కడా జరగలేదు. టెర్రరిస్ట్లకు కూడా ఇలాంటి వ్యవహారం ఉండదు. బ్రిటిష్ పాలనలో కూడా ఇలాంటి అక్రమాలు జరగలేదు” అని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి N. Chandrababu Naidu జిల్లా జడ్జితో న్యాయ విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అక్రమాలకు పాల్పడిన అధికారులను శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించాలని కోరారు. ఈ వ్యవహారంపై తాను న్యాయపోరాటం కొనసాగిస్తానని, ఎమ్మిగనూరులో ఇటువంటి ఆరాచకాలను సాగనివ్వబోనని కోనేరు నాగేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు.
Admin
DNB News