DNB News - ఆంధ్రప్రదేశ్ / : శ్రీకాకుళం జిల్లా రాజకీయ ముఖచిత్రంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. బుధవారం తాడేపల్లిలో తన నివాసంలో జరిపిన సమీక్షకు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం హాజరయ్యారు.ఈ చర్చల్లో జిల్లాలో పార్టీ భవిష్యత్తు,ప్రభుత్వ వ్యతిరేక పవనాలు మరియు ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా సాగాల్సిన వ్యూహాలపై జగన్ లోతుగా విశ్లేషించారు. ముఖ్యంగా ఆమదాలవలస నియోజకవర్గంతో పాటు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తమ్మినేని సీతారాం అధినేతకు వివరించారు.ఈ తరుణంలో పార్టీ క్యాడర్ అంతా ఐక్యమత్యంతో ముందుకు సాగితే రానున్న ఎన్నికల్లో విజయం తథ్యమని తమ్మినేని వివరించారు.దానికి స్పందించిన జగన్.. శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జ్గా జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలను సమన్వయం చేస్తూ ఎంపీ సీటును పార్టీ ఖాతాలో వేయడమే ఏకైక లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు.పార్టీ పిలుపుమేరకు ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ప్రజా వ్యతిరేక కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతం చేస్తున్న తమ్మినేని చొరవను జగన్ అభినందిస్తూ,సీనియర్ నేతగా ఆయనకు పార్టీలో తగిన గౌరవం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్ట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పార్టీ క్యాడర్ ఐక్యంగా పనిచేసిన విషయాన్ని పార్టీ అధినేత ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన హితబోధ చేశారు..ఓటర్ల జాబితా సవరణ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉంటూ,పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించకుండా కిందిస్థాయి నేతలు నిరంతరం నిఘా ఉంచాలని,డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జగన్ సూచించారు.శ్రీకాకుళం జిల్లాలో పార్టీని తిరుగులేని శక్తిగా మార్చాలంటే జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మరియు పార్లమెంటరీ ఇంచార్జ్ తమ్మినేని సీతారాం ఇరువురూ సమన్వయంతో,అత్యంత ఐక్యంగా పనిచేయాలని జగన్ ఆకాంక్షించారు. వీరిద్దరి సీనియారిటీ మరియు అనుభవం తోడైతే ప్రతి గ్రామంలోనూ పార్టీ బలోపేతమవుతుందని, ఎలాంటి విభేదాలకు తావులేకుండా ఉమ్మడిగా దిశానిర్దేశం చేస్తూ కేడర్ను ఎన్నికలకు సమాయత్తం చేయాలని జగన్ స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు.ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకోవడంలో ఈ ఇద్దరు దిగ్గజ నేతల ఐక్యత జిల్లాలో పార్టీకి శ్రీరామరక్ష అని జగన్ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.
Admin
DNB News