DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధిపై వచ్చిన యాభై లక్షల రూపాయల లంచం ఆరోపణలపై కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరిపించి నిజానిజాలు వెలికితీయాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదోని ఇన్చార్జి సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ కి ఫిర్యాదు చేశారు. ఈ వివాదం మరింత ముదిరితే రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆయన హెచ్చరించారు. పరిస్థితి అదుపు తప్పకముందే ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి సొంత స్థలం సమీపంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతుల విషయంలో ఎమ్మెల్యే యాభై లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశారని టిడిపి నాయకుడు సౌదీ గుజిరి రౌఫ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సౌదీ రౌఫ్ మరియు ఎమ్మెల్యే పార్థసారధి ఇద్దరికీ లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించి నిజమైన నిందితుడిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్లోని చారిత్రాత్మక ఆదోని షాహీ జామియా మసీదు నిర్వహణలో జరుగుతున్న ఆలస్యాలపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మసీదు బైలాస్ ప్రకారం ఎన్నికలు నిర్వహించి అభివృద్ధికి మార్గం సుగమం చేయాలని కోరారు. ప్రస్తుత ముతవల్లి సౌదీ రౌఫ్ పదవీకాలం ముగిసి ఆరు సంవత్సరాలు కావస్తున్నా ఎన్నికలు నిర్వహించకపోవడం విచారకరమని తెలిపారు. సౌదీ రౌఫ్ మరియు వక్ఫ్ బోర్డు పరస్పరం చర్చించి కేసులను వెనక్కి తీసుకుని త్వరితగతిన ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Admin
DNB News