DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లావ్యాప్తంగా సోమవారం నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఐపీఎస్ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ఉన్న పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు అధికారులు నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పోలీసు అధికారులు పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల పనితీరును పర్యవేక్షిస్తూ నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు, పరీక్షా ప్రాంగణాలలో కాపీయింగ్ (మాల్ప్రాక్టీస్) కు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. జిల్లా పోలీసు శాఖ తరఫున పరీక్షలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
Admin
DNB News