DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోనిలో గత 50 సంవత్సరాలుగా కార్మికులకు వైద్య సేవలు అందిస్తున్న ఈఎస్ఐ హాస్పిటల్ను కర్నూలుకు తరలించే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని కార్మిక సంఘాలు మరియు ఈఎస్ఐ లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ఈఎస్ఐ లబ్ధిదారుల ఆధ్వర్యంలో సోమవారం సబ్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు పి.ఎస్. గోపాల్, తిప్పన్న, ఈరన్న మరియు ఈఎస్ఐ లబ్ధిదారులు మాట్లాడుతూ, ప్రస్తుతం ఈఎస్ఐ ఆసుపత్రిని ఈస్ట్, వెస్ట్గా విభజించి వైద్యం అందిస్తున్నప్పటికీ తగిన సదుపాయాలు లేకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆసుపత్రిలో డాక్టర్ల కొరత, ఈసీజీ వంటి పరీక్షల సౌకర్యం లేకపోవడం, అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడం వల్ల ఈఎస్ఐ లబ్ధిదారులకు సరైన వైద్యం అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదోనిలో సుమారు 3000 మంది ఈఎస్ఐ చందాదారుల కుటుంబాలు ఉన్నాయని, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ ప్రాంతాల కార్మికులు కూడా ఈ ఆసుపత్రిపై ఆధారపడుతున్నారని పేర్కొన్నారు. మెరుగైన వైద్యం ఆశించి వచ్చే కార్మికులు సరైన సదుపాయాలు లేక నిరాశతో తిరిగి వెళ్తున్న పరిస్థితి ఉందన్నారు. అందువల్ల ప్రభుత్వం వెంటనే స్పందించి ఆసుపత్రిలో వైద్య సదుపాయాలను మెరుగుపరచాలని, డాక్టర్లు మరియు అవసరమైన సదుపాయాలను కల్పించాలని, అలాగే ఈఎస్ఐ హాస్పిటల్ను కర్నూలుకు తరలించే నిర్ణయాన్ని నిలిపివేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో దేవేంద్ర, తిక్కప్ప, శంకర్, మధు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News