DNB News - ఆంధ్రప్రదేశ్ / : పోలీసులపైనే ఓ యువకుడు పిస్టల్తో కాల్పులకు తెగబడటం నగరంలో కలకలం రేపింది. ఆ వివరాల్లోకి వెళ్తే... పోలీసులపై కాల్పుల యత్నం: విజయవాడలో ఉద్రిక్తత విజయవాడలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న పోలీసులపై ఓ యువకుడు తుపాకీతో దాడికి ప్రయత్నించాడు. శనివారం తెల్లవారుజామున 'ఆపరేషన్ వజ్రప్రహార్'లో భాగంగా కృష్ణలంకలోని షిరిడీ బాలాజీ లాడ్జిలో తనిఖీలు చేపట్టగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఏం జరిగిందంటే? మహబూబాబాద్ జిల్లాకు చెందిన కనకం మురళీ పటేల్ అనే యువకుడు హైదరాబాద్లో సినీ రంగంలో అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఆరు నెలల క్రితం బీహార్లో కొనుగోలు చేసిన 7ఎంఎం పిస్టల్తో ఇతడు విజయవాడకు వచ్చాడు. లాడ్జి గదిలోకి తనిఖీలకు వచ్చిన హెడ్ కానిస్టేబుల్ విజయ సారధి నాయక్పై మురళీ ఒక్కసారిగా పిస్టల్ ఎక్కుపెట్టాడు. అయితే ట్రిగ్గర్ లాక్ అవ్వడంతో అది పేలలేదు. సినిమా ఫక్కీలో ఛేజింగ్.. పోలీసును నెట్టేసి గది నుంచి పారిపోయిన నిందితుడు.. రాజీవ్ గాంధీ పార్క్ సమీపంలో మరో రెండుసార్లు పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. చివరకు పోలీసులు వెంబడించి, బస్టాండ్ ఎదురుగా ఉన్న రైల్వే ట్రాక్ వద్ద నిందితుడిని రాయిని విసిరి కొట్టి పట్టుకున్నారు. గ్రామ కక్షలే కారణమా? నిందితుడి వద్ద నుంచి పిస్టల్తో పాటు ఐదు బుల్లెట్లు, పెప్పర్ స్ప్రే, ఎలక్ట్రికల్ షాకింగ్ గన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన సొంత గ్రామంలో శత్రువులు ఉన్నారని, వారి నుంచి రక్షణ కోసమే తుపాకీ కొన్నట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.
Admin
DNB News