DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో తాగునీటి, సాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో మైనర్ ఇరిగేషన్, ఎల్ఎల్సీ, జీడీపీ, ఆర్డబ్ల్యూఎస్ మరియు వ్యవసాయ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి సరఫరా, చెరువులు, కాలువల నిర్వహణ, భూగర్భ జలాల పెంపు, రైతులకు నీటి అందుబాటు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. రానున్న కాలంలో ఎలాంటి నీటి సంక్షోభం తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించిన ఎమ్మెల్యే, చెరువులు, కాలువలు, పంపింగ్ వ్యవస్థలు, తాగునీటి వనరులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నీటి సంరక్షణ, సాగునీటి వనరుల అభివృద్ధి, రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో టీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, ఏఎంసీ చైర్మన్, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Admin
DNB News