DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పాలనలో జరిగిన భూ కబ్జాలు, అవినీతి అక్రమాలపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి (MHPS) రాష్ట్ర కార్యదర్శి ఏ. నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే పాలనలో భూ కబ్జాలు, అరాచకాలపై విమర్శలు చేస్తూ ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ పార్థసారధి, ఇప్పుడు తానే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భూ కబ్జాలకు సహకరిస్తున్నారనే వార్తలు రావడం తీవ్రంగా ఆందోళన కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామాల వల్ల ఆదోనిలో ఇప్పటికే దెబ్బతిన్న రియల్ ఎస్టేట్ రంగం మరింత సంక్షోభంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే స్వార్థ రాజకీయాలు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే పని చేస్తుండటంతో ఆదోని సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు తలెత్తుతున్నాయని విమర్శించారు. ఎమ్మెల్యే పార్థసారధి నిజాయితీ గల నాయకుడైతే, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాదరెడ్డి పాలనలో జరిగిన భూ కబ్జా ఆరోపణలు, అవినీతి అంశాలపై సీబీఐ విచారణకు వెంటనే సిఫారసు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సర్వే నంబర్ 162 ఆన్లైన్ వ్యవహారంలో తన పాత్రపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఎమ్మెల్యే పార్థసారధిని కోరారు. మరోవైపు, తన పాలనలో ఎలాంటి భూ కబ్జాలు జరగలేదని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాదరెడ్డి చెప్పడం హాస్యాస్పదమని నూర్ అహ్మద్ విమర్శించారు. గత పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై ప్రజల్లో ఉన్న ఆగ్రహమే డాక్టర్ పార్థసారధిని ఎమ్మెల్యేగా గెలిపించిందని పేర్కొన్నారు. అలాగే, సాయి ప్రసాదరెడ్డిపై విచారణ కమిషన్ వేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మను డిమాండ్ చేశారు. పాలక, ప్రతిపక్ష నాయకులు పరస్పర విమర్శలు మానుకొని ఆదోని నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకుడు షకీల్ పాల్గొన్నారు.
Admin
DNB News