DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు నగరంలో ప్రస్తుత వేసవి కాలంలో ప్రజలకు ఎలాంటి నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. ఆదివారం ఆయన సుంకేసుల జలాశయం, మునగాలపాడు నీటి శుద్ధి కేంద్రం, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును ఇంజనీరింగ్ విభాగ అధికారులతో కలిసి పరిశీలించారు. జలవనుల శాఖతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ నీటి సరఫరాను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నీటి శుద్ధి కేంద్రాల్లో మరమ్మత్తు పనులను తక్షణమే చేపట్టాలని, శుద్ధి ప్రక్రియలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని, నిర్లక్ష్యానికి తావులేదని హెచ్చరించారు. శుద్ధి కేంద్రాల పరిసరాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఇంజనీరింగ్ అధికారులు ప్రతిరోజు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర ప్రజలకు వేసవిలో తాగునీటి సమస్య రాకుండా మూడు వేర్వేరు ప్రాజెక్టుల్లో మొత్తం 3.64 టీఎంసీల నీటిని నిల్వ చేసినట్లు తెలిపారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో 0.16 టీఎంసీల నీరు నిండుగా ఉందని, సుంకేసుల జలాశయంలో 1.2 టీఎంసీల నిల్వ ఉందన్నారు. అలాగే గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి 2.28 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. జూలై నెలాఖరు వరకు సరిపడా నీటి నిల్వలు ఉన్నందున ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ రమణమూర్తి, ఎంఈలు మనోహర్ రెడ్డి, గిరిరాజ్, ఏఈ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News