DNB News - ఆంధ్రప్రదేశ్ / : వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలూరు నియోజకవర్గంలో “వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలూరు ఎమ్మెల్యే శ్రీ విరూపాక్షి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నకల్ సురేందర్ రెడ్డి, పరిశీలకులు రామచంద్ర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే విరూపాక్షితో కలిసి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ఫొటో గ్యాలరీని ప్రదర్శించారు. అనంతరం నల్ల బెలూన్లు ఎగురవేస్తూ నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో మాట్లాడిన వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నకల్ సురేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు సహా అనేక హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి మెగా డీఎస్సీ వంటి అంశాల్లో మోసం చేశారని విమర్శించారు. నిరుద్యోగుల హక్కుల కోసం వైఎస్సార్సీపీ నిరంతరం పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. మహిళలకు అందిస్తామని చెప్పిన ‘ఆడబిడ్డ నిధి’ హామీ ఏమైందని ప్రశ్నించిన ఆయన, రైతులు, మహిళలు, పేదలు సహా అన్ని వర్గాల ప్రజలు ఈ రెండేళ్ల పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు. ప్రజలను మోసం చేసిన ఈ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
DNB News