DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో ఈ నెల 19న శక్తి గుడి గ్రౌండ్లో నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమంలో జరిగిన ద్వేషపూరిత ప్రసంగంపై వివిధ రాజకీయ మరియు సామాజిక నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఒక వ్యక్తి చేసిన ప్రసంగంపై తక్షణ విచారణ జరిపి, బాధ్యులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం సబ్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించినట్లు SDPI నాయకులు సద్దాం హుస్సేన్, కాంగ్రెస్ నాయకులు సయ్యద్ ఫరూక్, టిడిపి నాయకులు ఇక్బాల్, వైకాపా నాయకులు అబుబకర్ యాసిన్, ప్రజా సంఘాల నాయకులు ఖాదర్ నిస్సార్ తెలిపారు. సంఘటన జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు సంబంధిత పోలీస్ అధికారులు ఎటువంటి స్పష్టమైన చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో తీవ్ర ఆందోళన, అనిశ్చితికి దారితీసిందని వారు పేర్కొన్నారు. సంఘటనకు సంబంధించిన వీడియో ఆధారాలు, ప్రత్యక్ష సాక్ష్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం, బాధ్యులపై చర్యలు ప్రారంభించకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రసంగం మతాల మధ్య విభేదాలు, ఉద్రిక్తతలు సృష్టించేలా ఉందని పేర్కొంటూ, చట్టం అందరికీ సమానంగా అమలు కావాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాజంలో శాంతి, సౌహార్ద వాతావరణం నెలకొనేలా ప్రభుత్వం మరియు పోలీస్ యంత్రాంగం వెంటనే స్పందించాలని వారు కోరారు.
Admin
DNB News