DNB News - ఆంధ్రప్రదేశ్ / : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సబ్సిడీ ఆధారిత రుణ పథకాలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించుకోవాలని ఆదోని ఎమ్మెల్యే డా. పి.వి. పార్థసారథి సూచించారు. కెనరా బ్యాంక్ ఓల్డ్ టౌన్ శాఖ చీఫ్ మేనేజర్ రాజేష్ రాజమోహన్ ఆధ్వర్యంలో ఆదోని ఎంపీడీవో కార్యాలయంలో బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారులు మరియు పారిశ్రామికవేత్తలతో అవగాహన సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్సిడీ రుణ పథకాల ద్వారా యువత, రైతులు, చిన్న వ్యాపారవేత్తలు ఆర్థికంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు రుణాలు అందించడంలో బ్యాంకులు చొరవ చూపాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ పి. మోహన్ మాట్లాడుతూ, పాడి పరిశ్రమ, పశుసంవర్ధక రంగం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ విరివిగా రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. ప్రభుత్వ ప్రాయోజిత పథకాల అమలులో బ్యాంకులు, శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. అలాగే సీసీఆర్సీ (CCRC) కార్డులు కలిగిన కౌలు రైతులకు వ్యవసాయ రుణాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. PMEGP, PMFME, PM Surya Ghar తదితర కేంద్ర ప్రభుత్వ పథకాల కింద అర్హులైన వారికి రుణాలు అందించి స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించాలని సూచించారు. సీబీఆర్సెటి (CB RSETI) డైరెక్టర్ పుష్ప కుమార్ మాట్లాడుతూ, కర్నూలు జిల్లా బి. తాండ్రపాడులోని శిక్షణ కేంద్రంలో గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ స్వయం ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల యువత ఈ అవకాశాన్ని వినియోగించుకుని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదోని నియోజకవర్గ పరిధిలోని వివిధ బ్యాంకుల శాఖ మేనేజర్లు, అగ్రికల్చర్, DRDA, MEPMA మరియు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, పారిశ్రామికవేత్తలు, స్వయం ఉపాధి అభిలాషులు పాల్గొన్నారు.
Admin
DNB News