DNB News - ఆంధ్రప్రదేశ్ / : సామాన్య ప్రజలపై పెరిగిన వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలోని శ్రీనివాస భవన్ సర్కిల్ వద్ద గ్యాస్ సిలిండర్లతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశులు, సీనియర్ నాయకులు ఈరన్న పాల్గొని మాట్లాడారు. అమెరికా ప్రోత్సాహంతో జరుగుతున్న యుద్ధాల కారణంగా అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు పెరిగి ప్రజలపై భారంగా మారాయని వారు పేర్కొన్నారు. ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా దాడులను ఖండించాలని భారత ప్రభుత్వం గట్టిగా స్పందించాలని కోరారు. యుద్ధాల వల్ల అమాయక ప్రజలు, చిన్నపిల్లలు, పాఠశాలలు, ఆస్పత్రులు, నివాస ప్రాంతాలు దెబ్బతింటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధ పరిస్థితుల కారణంగా వంట గ్యాస్ ధర రూ.60, కమర్షియల్ గ్యాస్ ధర రూ.114 పెరగడం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని తెలిపారు. వెంటనే పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇరాన్తో ఉన్న భారతదేశ ఆర్థిక, వాణిజ్య సంబంధాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం సరైన వైఖరితో వ్యవహరించాలని సూచించారు. ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు గ్యాస్ ధరలను తగ్గించడమే కాకుండా యుద్ధాలకు వ్యతిరేకంగా భారత్ జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ, మండల కార్యదర్శులు లక్ష్మన్న, లింగన్నతో పాటు నాయకులు గోపాల్, తిప్పన్న, పాండు, వీరేష్, వెంకటేశులు, ముని, శంకరప్ప తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News