DNB News - ఆంధ్రప్రదేశ్ / : అధిక శబ్దం కలిగించే బైక్ సైలెన్సర్లు, ఆటో హారన్లపై కఠిన చర్యలు తీసుకుంటూ కర్నూలు పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో సీజ్ చేసిన 100 బైక్ సైలెన్సర్లు, 500 ఆటో హారన్లను శనివారం జిల్లా పోలీసు కార్యాలయం, కొండారెడ్డి బురుజు సమీపంలో రోడ్ రోలర్తో ధ్వంసం చేశారు కర్నూలు పట్టణంలో కొంతమంది యువకులు తమ ద్విచక్ర వాహనాలకు మాడిఫై చేసిన సైలెన్సర్లు అమర్చుకుని అధిక శబ్దంతో వాహనాలు నడుపుతున్నారని ప్రజల నుండి ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో శబ్ద కాలుష్యం పెరిగి వృద్ధులు, చిన్నారులు, రోగులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని గుర్తించారు. దీంతో ఒక నెల రోజుల పాటు కర్నూలు సబ్ డివిజన్ పోలీసులు, కర్నూలు ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ఈ సైలెన్సర్లు, హారన్లను సీజ్ చేశారు. అనంతరం చట్టప్రకారం వాటిని రోడ్ రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. మోటార్ వెహికల్స్ చట్టం ప్రకారం అనుమతి లేని మార్పులు చేసిన వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా మోడిఫై చేసిన సైలెన్సర్లు, అధిక శబ్దం చేసే హారన్లు అమర్చినట్లయితే జరిమానాలతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు, ముఖ్యంగా యువతకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పిస్తున్నామని, ప్రతి వాహనదారుడు వ్యక్తిగత భద్రతతో పాటు రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు పట్టణంలో సామాజిక బాధ్యత కలిగిన పబ్లిక్, ప్రైవేట్ సంస్థలు ట్రాఫిక్ పోలీసులకు సహకారం అందిస్తున్నాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల క్రింద ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు దాతలు సహకారం అందించారు. ట్రాఫిక్ పోలీసులకు డిజిటల్ ఎల్ఈడి డిస్ప్లే బోర్డు, 66 సోలార్ రెడ్ బ్లింకింగ్ స్టడ్స్, 4 ఆధునాతన మూవబుల్ బారికేడ్స్ను దాతలు అందజేశారు. రద్దీ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో రోడ్డు స్పష్టంగా కనిపించేలా సోలార్ రెడ్ బ్లింకింగ్ స్టడ్స్ను త్వరలో మరింత సంఖ్యలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహన్, డిఎస్పీ జె.బాబు ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ సిఐ మధుసుధన్ రావు, ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.
Admin
DNB News