DNB News - తెలంగాణ / : తెలంగాణ ప్రభుత్వం, కళాశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జూన్ 6 నుండి 12 వరకు చేపట్టిన ఎన్రోల్మెంట్ డ్రైవ్ ను విజయవంతం చేసేందుకు ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల (అటానమస్), కరీంనగర్లో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. రామకృష్ణ అధ్యక్షతన అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో అందుబాటులో ఉన్న డిగ్రీ కోర్సులు, అప్రెంటిషిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రాములు (AEDP), విద్యా సౌకర్యాలు, ఉపాధి అవకాశాలు, స్కాలర్షిప్లు మరియు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు కళాశాల ప్రాంగణం, సమీపప్రభుత్వ జూనియర్ కళాశాలలు మరియు ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే కళాశాల విద్యాశాఖ రూపొందించిన కాలింగ్ యాప్ ద్వారా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులను ప్రతిరోజూ ఫోన్ ద్వారా సంప్రదించి డిగ్రీ ప్రవేశాలపై మార్గదర్శకత్వం అందించాలని ప్రిన్సిపాల్ సూచించారు. ఈ సందర్భంగా దోస్త్ కోఆర్డినేటర్ డా. ఆర్. రామకృష్ణ మాట్లాడుతూ, దోస్త్ మూడవ విడత రిజిస్ట్రేషన్కు జూన్ 15 వరకు అవకాశం ఉందని, జూన్ 16 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. జూన్ 20న సీట్ల కేటాయింపు జరుగుతుందని, ఎంపికైన విద్యార్థులు జూన్ 20 నుండి 25 వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలని సూచించారు. అలాగే అన్ని విడతల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసిన విద్యార్థులు జూన్ 20 నుండి 27వరకు తమ ఇంటర్మీడియట్ ఒరిజినల్ టిసి మరియు ఇతర అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో కళాశాలకు హాజరై అడ్మిషన్ కన్ఫర్మేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో వైస్ ప్రిన్సిపాళ్లు పి. నితిన్, టి.రాజయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ టి. శ్రీనివాస్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. హర్జ్యోత్ కౌర్, స్టాఫ్ క్లబ్ సెక్రెటరీ డా. ఎం. శ్రీనివాస్ రెడ్డి, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
Admin
DNB News