DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితిపై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి (ఎంహెచ్పీఎస్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేయడంలో స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి నిర్లక్ష్యం చూపుతున్నారని సమితి ఆరోపించింది. మహిళా శిశు ఆసుపత్రిలో సోమవారం వందలాది గర్భిణీలు స్కానింగ్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి రావడం తీవ్ర ఆందోళన కలిగించిందని తెలిపింది. ఆసుపత్రిలో రద్దీ అధికంగా ఉండటం, స్కానింగ్ యంత్రాల కొరత కారణంగా గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ఈ పరిస్థితి చూస్తే పేదలుగా పుట్టడమే వారి పాపమా అన్న భావన కలుగుతోందని నూర్ అహ్మద్ విమర్శించింది. ఎమ్మెల్యేగా ఎన్నికై రెండేళ్లు పూర్తయినా ఆదోని నియోజకవర్గంలో ప్రజలకు సరైన అభివృద్ధి కనిపించడం లేదని సమితి అభిప్రాయపడింది. సోషల్ మీడియాలో మాత్రమే కార్యకలాపాలు పరిమితమైపోయాయని, పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించింది. అసెంబ్లీలో వంద శాతం హాజరు ఉన్నప్పటికీ ఆదోని పట్టణంలో మాత్రం ప్రజల మధ్య తక్కువగా కనిపిస్తున్నారని పేర్కొంది. ఇప్పటికైనా ఎమ్మెల్యే చొరవ తీసుకుని ఆదోని నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించాలని సమితి డిమాండ్ చేసింది. లేకపోతే ఎమ్మెల్యే నిర్లక్ష్య పాలనపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించింది.
Admin
DNB News