DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న స్త్రీ శక్తి పథకం కారణంగా ఆర్టీసీ బస్సుల అక్యుపెన్సీ రేషియో 67 శాతం నుంచి 98 శాతానికి పెరిగిందని, ఈ పెరిగిన ప్రయాణికుల డిమాండ్కు అనుగుణంగా ఆర్టీసీ బస్సుల సంఖ్యను తక్షణమే పెంచాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదోని ఆర్టీసీ డిపో మేనేజర్ రఫీక్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ మండల కార్యదర్శులు లక్ష్మన్న, లింగన్న, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్, తిప్పన్న, నాయకులు వెంకటేష్, భీమ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగినా బస్సుల సంఖ్య పెరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా మహిళా ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని, సకాలంలో స్కూళ్లు, కాలేజీలకు విద్యార్థులు చేరుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు అక్యుపెన్సీ పెరిగి ఉండగా, మరోవైపు బస్సులు పాతవిగా మారడంతో తరచూ మధ్యలో నిలిచిపోతున్నాయని గుర్తు చేశారు. పెరిగిన ప్రయాణికుల సంఖ్యకు తగిన విధంగా బస్సులు లేకపోవడమే ఈ సమస్యలకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఇటీవల ప్రైవేట్ బస్సుల్లో మూడు ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగించే విషయమని, రవాణా శాఖ సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని వారు విమర్శించారు. రాష్ట్రంలో ఆర్టీసీకి 11 వేల మంది సిబ్బంది అవసరమని అధికారులు కోరుతున్నప్పటికీ, ఇప్పటివరకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టీసీకి అవసరమైన సిబ్బందిని నియమించాలని, ప్రజల అవసరాల డిమాండ్కు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది.
Admin
DNB News