DNB News - ఆంధ్రప్రదేశ్ / : జిల్లాలో మత్తు పదార్థాల రవాణా మరియు వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నార్కోటిక్స్ కోఆర్డినేషన్ (NCORD) సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలలో మత్తు పదార్థాల వినియోగంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. విద్యాసంస్థల పరిసరాల్లో మత్తు పదార్థాల విక్రయాలపై గట్టి నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. పంట పొలాల్లో గంజాయి సాగుపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయాలని, వ్యవసాయ మరియు రెవెన్యూ శాఖల అధికారులు పోలీస్ శాఖకు తక్షణ సమాచారం అందించాలని తెలిపారు. ఆర్టీసీ బస్సుల ద్వారా మత్తు పదార్థాల రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఆర్ఎంను ఆదేశించారు. అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా మాట్లాడుతూ జనవరి నుంచి ఇప్పటివరకు జిల్లాలో రెండు కేసులు నమోదు చేసి, 1.350 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని చెప్పారు. క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు, సెట్కూర్ సీఈవో వేణుగోపాల్, డీఈఓ సుధాకర్, ఆర్ఐవో లాలెప్ప, ఈగల్ ఎస్సై సుజన్ కుమార్, డీఎంహెచ్ డా. భాస్కర్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాధిక, బీసీ వెల్ఫేర్ అధికారి ప్రసూన తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News