DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో క్రీడాకారులు ఎదుర్కొంటున్న క్రీడా మైదానాల కొరతను త్వరలోనే శాశ్వత ప్రాతిపదికన పరిష్కరిస్తామని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి హామీ ఇచ్చారు. గురువారం ఆదోనిలో నిర్వహించిన ‘ISPL ఆదోని క్రికెట్ టోర్నమెంట్’ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన క్రీడాకారులను అభినందించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా బ్యాట్ చేతబట్టి క్రికెట్ ఆడుతూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు. ఎమ్మెల్యే బ్యాటింగ్ చేయడం చూసిన యువ క్రీడాకారులు, ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆదోనిలో క్రీడలకు, ముఖ్యంగా క్రికెట్కు విశేష ఆదరణ ఉన్నప్పటికీ యువతకు సరిపడా క్రీడా మైదానాలు లేకపోవడం విచారకరమన్నారు. ఈ సమస్యను గుర్తించి, క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్న ఎమ్మెల్యే, యువత వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. స్థానిక క్రీడాకారులను ప్రోత్సహించేందుకు టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు, క్రీడాభిమానులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.
Admin
DNB News