DNB News - ఆంధ్రప్రదేశ్ / : గ్రామ స్థాయి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ కమిటీల ఏర్పాటుకు వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా జె. కన్వెన్షన్ ప్రాంగణంలో అవగాహన సమావేశం నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్సా సత్యనారాయణ తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా విస్తృతస్థాయి జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అతిరధ మహారధులు మాట్లాడుతూ.... ఒక మంచి భవనం నిలవాలంటే బలమైన పునాది ఎంత అవసరమో,అలాగే పార్టీకి గ్రామ స్థాయి కమిటీలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి తారతమ్యాలు లేకుండా, సరైన వ్యక్తికి సరైన బాధ్యత అప్పగిస్తూ కమిటీల నియామకాలు జరగాలని, ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ,వరి పంటకు సంబంధించిన కాలువలు,ఎరువుల కొరత, గ్రామ సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయడం, ఫీల్డ్ అసిస్టెంట్లు మరియు వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. నియంతృత్వ ధోరణిలో సాగుతున్న పాలనపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, పార్టీ కార్యక్రమాల్లో ప్రజల సమస్యలపై ఉద్యమాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇలా ఉద్యమాలు చేసేందుకు పార్టీ గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను పకడ్బందీగా అమలు చేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదేనని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో దుష్ప్రచారం చేసిన కూటమి నేతలు, ఇప్పుడు అదే వ్యవస్థను తమ ఘనతగా చెప్పుకోవడం విడ్డూరమని ఏద్దేవా చేశారు. ప్రజల సంక్షేమాన్ని డబుల్ చేస్తామన్న కూటమి ప్రభుత్వం, ప్రజల సమస్యలను మాత్రమే డబుల్ చేసి అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మిస్తోందని ఆరోపించారు. చివరికి ప్రజలే అన్ని విషయాలను గమనించి కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Admin
DNB News