DNB News - ఆంధ్రప్రదేశ్ / : మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు అవగాహన అత్యంత ముఖ్యమని, మహిళల భద్రత మనందరి బాధ్యత అని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ తెలిపారు. మంగళవారం ఆలూరు మండల కేంద్రంలోని ఇబ్రహీం ఫంక్షన్ హాల్లో “మీ రక్షణ – మా బాధ్యత” పేరుతో మహిళల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని తెలిపారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా సంకోచం లేకుండా పోలీసులను సంప్రదించాలని మహిళలకు పిలుపునిచ్చారు. చట్టాలపై అవగాహన పెరిగితేనే నేరాలు తగ్గుతాయని పేర్కొన్నారు. మహిళల రక్షణ కోసం దేశంలో అనేక చట్టాలు అమల్లో ఉన్నాయని, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచే మహిళలకు ఓటు హక్కు, ఆస్తిలో సమాన హక్కులు కల్పించారని తెలిపారు. పోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, నిర్భయ చట్టం వంటి పలు చట్టాలు మహిళల రక్షణకు దోహదపడుతున్నాయని వివరించారు. పని ప్రదేశాల్లో గానీ, సమాజంలో గానీ మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా వెంటనే పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. భయపడకుండా ముందుకు వస్తేనే చట్టాల పరిరక్షణ లభిస్తుందని తెలిపారు. జిల్లా పోలీసు శాఖ మహిళలపై నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. పోలీస్ స్టేషన్కు రాకుండానే సహాయం పొందేందుకు “శక్తి యాప్” వంటి ఆధునిక సాంకేతిక సదుపాయాలను మహిళలు వినియోగించుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ యాప్ ద్వారా తక్షణ సహాయం పొందవచ్చని తెలిపారు. మహిళలు ఎటువంటి వేధింపులు ఎదుర్కొన్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, డయల్ 112, 181, 1098, 1930 హెల్ప్లైన్ నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు.
Admin
DNB News