DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రాధాన్యత క్రమంలో మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీ.జీ. భరత్ గుప్తా తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసుతో కలిసి వివిధ వార్డుల్లో రూ.1.17 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. 22, 23, 24, 25వ వార్డుల్లో రూ.35.40 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, హెచ్డీపీఈ పైప్లైన్లు, కమ్యూనిటీ టాయిలెట్ల మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే 42, 43, 45, 46వ వార్డుల్లో రూ.65.25 లక్షలతో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, పార్కు అభివృద్ధి, పైప్లైన్ నిర్మాణ పనులు ప్రారంభించారు. 47, 48, 50, 52వ వార్డుల్లో రూ.16.99 లక్షలతో కమ్యూనిటీ టాయిలెట్ల మరమ్మతులు, డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరాన్ని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. నగరంలోని ఆరు పార్కులను అన్ని హంగులతో అభివృద్ధి చేస్తున్నామని, ప్రతి పార్కులో వాకింగ్ ట్రాక్లు, గ్రీనరీతో పాటు ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో త్వరలోనే భారీ స్థాయిలో డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. గత రెండు రోజుల్లో దాదాపు రూ.3 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామని, నెల రోజుల్లోపు అన్ని పనులను నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
Admin
DNB News