DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎస్సీల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు మేకల బిక్షం పేర్కొన్నారు. శనివారం కర్నూలు పర్యటనలో భాగంగా స్థానిక రాష్ట్ర అతిథి గృహానికి విచ్చేసిన ఆయనకు అధికారులు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం ప్రజల నుండి వినతులను స్వీకరించిన మేకల బిక్షం, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా ఎస్సీ వర్గాలకు సంబంధించిన భూసంబంధిత సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, విద్య మరియు ఉపాధి అంశాలపై వినతులు సమర్పించారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న ఆయన, వాటిని సానుకూలంగా పరిశీలించి వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా రాబోయే పది రోజులలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని శాఖలపై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సీల సంక్షేమానికి సంబంధించిన పథకాల అమలు స్థితి, సమస్యలు, సమస్యల పరిష్కార మార్గాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు వెల్లడించారు. ఎస్సీ వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం మరియు కమిషన్ సమన్వయంతో పని చేస్తున్నాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి మద్దిలేటి, తహసీల్దార్ ఆంజనేయులు, వివిధ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News