DNB News - ఆంధ్రప్రదేశ్ / : నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. గురువారం స్థానిక వెంకటరమణ కాలనీలోని నగరపాలక కార్యాలయంలో నగరపాలక సంస్థ, ట్రాఫిక్ పోలీస్, ఏపీఎస్ ఆర్టీసీ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజల సౌకర్యార్థం ముఖ్య ప్రాంతాల్లో కొత్త బస్స్టాప్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ట్రాఫిక్కు ఇబ్బందులు కలిగిస్తున్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ సక్రమమైన బస్స్టాప్ సౌకర్యాలు కల్పించేందుకు రవాణా శాఖ అధికారులు సహకరించాలని కోరారు. అలాగే రెడ్ జోన్లలో వీధి వ్యాపారుల నియంత్రణ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామని పేర్కొన్నారు. రహదారులపై అక్రమ వ్యాపారాలు ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నాయని, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో రెడ్ జోన్లలో కఠిన చర్యలు తీసుకుని ట్రాఫిక్ సౌలభ్యాన్ని మెరుగుపరచాలని, పట్టణ ప్రణాళిక, మెప్మా అధికారులకు ట్రాఫిక్ పోలీసులు పూర్తి సహకారం అందించాలని సూచించారు. పోలీసు, ఆర్టీసీ శాఖలు నగరపాలక సంస్థతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని కమిషనర్ కోరారు. ప్రజల సౌకర్యం, నగర సౌందర్యం, రోడ్డు భద్రత కోసం అన్ని శాఖలు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో ఎస్ఈ రమణమూర్తి, ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు, ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ హరి, ఇంచార్జి సిటీ ప్లానర్ వై. వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News