DNB News - ఆంధ్రప్రదేశ్ / : జిల్లాలో ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ తెలిపారు. పరీక్షల సమయంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ తరపున కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షా పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా పేపర్లు కేంద్రాలకు తీసుకువెళ్లేటప్పుడు, సమాధాన పత్రాలు తరలించే సమయంలో కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండడంతో కేంద్రాల ఆవరణలో ఇన్విజిలేటర్లు మరియు పరీక్షలకు కేటాయించిన సిబ్బంది తప్ప ఇతరులు ఎవరూ ఉండరాదని స్పష్టం చేశారు. అలాగే పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన మేరకు బందోబస్తు ఏర్పాటు చేసి, ఎటువంటి అవకతవకలు లేదా మాల్ ప్రాక్టీస్ జరగకుండా పోలీసు అధికారులు పకడ్బందీగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని ట్రాఫిక్ అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని, తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గమనించి వారికి సహకరించాలని సూచించారు. మాస్ కాపీయింగ్ లేదా మాల్ ప్రాక్టీస్కు ఎవరైనా పాల్పడినా, వారికి సహకరించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని ఏ పరీక్షా కేంద్రం వద్ద అయినా అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే డయల్ 112 / 100కు సమాచారం అందించాలని జిల్లా ప్రజలను ఎస్పీ కోరారు. జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు.
Admin
DNB News