DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా ఆదోనిలోని ఒక చెరువులో గత 40 సంవత్సరాలుగా మత్స్యకార కుటుంబానికి చెందిన నారాయణ కుటుంబం చేపల వేట చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ కారణాల వల్ల అనంతరం ఇతర కులాలకు చెందిన వారు కూడా అదే చెరువులో చేపల వేట చేపట్టారని పేర్కొన్నారు. నారాయణ కుటుంబంతో పాటు ఇతరులు కూడా చేపల వేట సాగిస్తున్న సమయంలో తమను గంగపుత్ర సంఘం నాయకులమని చెప్పుకునే కోదండ, ఆయన కుమారుడు రమేష్, ప్రకాష్, దీపక్, శ్రీనివాసులు వ్యవహారంలో జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. తమ వంతుగా లక్ష రూపాయలు సీడ్ కోసం చెల్లించి చేపల వేట సాగిస్తున్నప్పటికీ, గంగపుత్ర సంఘం పేరుతో వాటాలు తీసుకున్నారని నారాయణ తెలిపారు. ఆ డబ్బులను గంగాభవాని దేవాలయానికి ఇస్తామని చెప్పినా, దేవాలయ నిర్వాహకులు తమకు ఎలాంటి నగదు అందలేదని స్పష్టం చేశారని అన్నారు. అనంతరం ప్రైవేట్గా గంగమ్మ దేవరకు ఇచ్చామని మాట మార్చారని ఆరోపించారు. చివరికి 40 సంవత్సరాలుగా చేపల వేట వృత్తితో జీవిస్తున్న తన కుటుంబాన్ని చేపలు పట్టకుండా బెదిరిస్తున్నారని నారాయణ వాపోయారు. రమేష్ అనే వ్యక్తి తమ కుటుంబాన్ని దూషించి బెదిరించాడని ఆరోపించారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని, బెదిరింపులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని నారాయణ కూటమి నాయకులను కోరారు. ఈ సమావేశంలో మల్లికార్జున, రాజేష్, చిదానంద, లక్ష్మన్న, సురేందర్, వీరేష్ తదితరులు పాల్గొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Admin
DNB News