DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ముందస్తు అడ్మిషన్లు నిర్వహించి విద్యార్థులు, తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయని ఏఐఎస్ఎఫ్ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏఐఎస్ఎఫ్ తాలూకా సమితి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యస్. షాబీర్ భాష, జిల్లా సహాయ కార్యదర్శి థామస్, జిల్లా ఉపాధ్యక్షుడు ఈరేష్ మాట్లాడుతూ— ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1ను పూర్తిగా విస్మరించి ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్ బోర్డులు ఏర్పాటు చేసి తప్పుడు ప్రచారాలతో విద్యార్థులను ఆకర్షిస్తున్నాయని ఆరోపించారు. ముందస్తు అడ్మిషన్ల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చేస్తున్నారని, కొంతమంది గుర్తింపు లేని విద్యాసంస్థలు కూడా అడ్మిషన్లు చేపట్టి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నాయని తెలిపారు. విద్యార్థుల ఇళ్లకు పీఆర్వోలు పంపించి ఒత్తిడి తీసుకువస్తూ అడ్మిషన్లు నమోదు చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిన విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వారి పర్యవేక్షణ లోపమే ప్రైవేట్ విద్యాసంస్థల ఆగడాలకు కారణమని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, గుర్తింపు లేకుండా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్యాసంస్థలను సీజ్ చేసి, అక్రమ ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల ఎదుట ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కోశాధికారి వీరేష్, నాయకులు శివ, ఆకాష్, నర్సప్ప, రాజు, నవీన్, దివాకర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News