DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ₹10 లక్షల అవినీతి ఆరోపణలు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో సంబంధిత అంశంపై పూర్తిస్థాయి, నిష్పక్షపాత విచారణ జరిపించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI), ఆదోని తరఫున కన్వీనర్ గౌస్ ఖాన్ సబ్ కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులపై వచ్చిన ఆరోపణలు పారదర్శకంగా విచారణకు లోబడి నిజానిజాలు వెలుగులోకి రావడం ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. అలాగే ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) కూడా గంభీరంగా పరిగణించి, సంబంధిత శాఖల ద్వారా గ్రౌండ్ స్థాయి నివేదిక సేకరించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే సమయంలో, కొంతమంది వ్యక్తులు ఈ అంశాన్ని మళ్లించేందుకు షాహీ జామియా మస్జిద్ పేరును సోషల్ మీడియా వేదికల్లో అనవసరంగా ప్రస్తావిస్తూ, మతపరమైన భావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మస్జిద్పై అసత్య ప్రచారం చేయకుండా, సామాజిక సామరస్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి, ఆదోని DSP కి తగిన ఆదేశాలు జారీ చేసి, మస్జిద్పై తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు చేస్తున్న యువతకు కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా ఇటువంటి ఘటనలను నివారించాలని విజ్ఞప్తి చేశారు. అదనంగా, షాహీ జామియా మస్జిద్ ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ మరియు ప్రాచీన మస్జిద్లలో ఒకటిగా ఉన్నదని గుర్తుచేస్తూ, గత 10 సంవత్సరాలుగా నిర్వహించని మస్జిద్ ఎన్నికలను బైలాస్ ప్రకారం తక్షణమే నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డుకు ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరారు. ఈ కార్యక్రమంలో SDPI ఆదోని డివిజన్ నాయకులు పాల్గొని తమ మద్దతును తెలియజేశారు. ముఖ్యంగా కో-కన్వీనర్ సద్దామ్ హుస్సేన్ , నాసిర్, ఆసిఫ్, ఖాదర్ బాషా, నిసార్ అహ్మద్ , అలాగే అద్రభాషా తదితరులు పాల్గొన్నారు. సామాజిక శాంతి, పారదర్శక పరిపాలన మరియు మతపరమైన గౌరవాన్ని కాపాడేందుకు సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి... గౌస్ ఖాన్ కన్వీనర్ సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI), ఆదోని
Admin
DNB News