DNB News - ఆంధ్రప్రదేశ్ / : కుప్పగల్ లో ఇటీవల బీజేపీ నాయకులు, టీడీపీ కార్యకర్తల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో గాయపడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తను మదిరే సొసైటీ డైరెక్టర్ ముగ్ధూం భాష పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కూటమి నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో వరుసగా జరుగుతున్న ఘర్షణలు చూస్తుంటే కూటమి నాయకత్వంలో సమన్వయం పూర్తిగా లోపించిందని విమర్శించారు. “పెద్దలు ఒక్కటిగా ఉంటేనే కార్యకర్తలు సఖ్యతగా ఉంటారు. కానీ ఆదోని నియోజకవర్గంలో మూడు పార్టీల నాయకులు మూడు విధాలుగా వ్యవహరిస్తున్నారు. అసలు కూటమి పాలన ఉందా లేదా అన్న అనుమానం కలుగుతోంది” అని వ్యాఖ్యానించారు. కూటమిలో ఎవరికి నష్టం జరిగినా చివరికి బాధపడేది కార్యకర్తలేనని అన్నారు. ఇటీవల జరిగిన ఘటనలో గాయపడిన వారిని ఎమ్మెల్యే పార్థసారథి, సీనియర్ టీడీపీ నాయకుడు ఉమాపతి నాయుడు పరామర్శించి శాంతి, సఖ్యత పాటించాలని సూచించారని, అదే సందేశాన్ని కూటమి పెద్దలే ముందుగా ఆచరణలో చూపించాలని ప్రశ్నించారు. గ్రామాల్లో ఘర్షణలు కొనసాగితే భవిష్యత్తులో ఆదోనిలో ఫ్యాక్షన్ వాతావరణం ఏర్పడే ప్రమాదం ఉందని ఒక సీనియర్ జర్నలిస్టుగా తన అనుభవంతో చెబుతున్నానని ముగ్ధూం భాష తెలిపారు. టీడీపీకి గ్రామస్థాయిలో బలమైన క్యాడర్ ఉందని, ఇటీవల వైసీపీ నుంచి బీజేపీలో చేరిన వారిని నియంత్రించే బాధ్యత కూటమి నాయకులపై ఉందన్నారు. ఎమ్మెల్యే పార్థసారథి సమన్వయ పాత్ర పోషించాలని సూచించిన ఆయన, రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కూటమి బలోపేతానికి కృషి చేస్తుంటే ఆదోనిలో మాత్రం విభజించి పాలించే పరిస్థితి కనిపిస్తోందని విమర్శించారు. నియోజకవర్గంలోని అధికారులు కూడా రాజకీయ సమన్వయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొందరు బదిలీలు కోరుకుంటున్న పరిస్థితి ఉందన్నారు. కబ్జాలపై మాత్రమే దృష్టి పెట్టకుండా కార్యకర్తల సమస్యలపై కూడా దృష్టి సారించాలని కోరారు. కర్నూలు జిల్లా ఇన్చార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదోని నియోజకవర్గ పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేసిన ముగ్ధూం భాష, “ప్రశాంతమైన ఆదోనికి ఫ్యాక్షన్ ముద్ర పడకముందే కూటమి పెద్దలు అందరూ ఒక తాటిపైకి రావాలి” అని ఆవేదన వ్యక్తం చేశారు.
Admin
DNB News