DNB News - ఆంధ్రప్రదేశ్ / : కేంద్ర ప్రభుత్వం నేటి నుంచి అమలు చేయనున్న నాలుగు లేబర్ కోడ్లను నిరసిస్తూ ఆదోని పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా AITUC జిల్లా అధ్యక్షులు ఎన్. కృష్ణయ్య మాట్లాడుతూ, కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ నవంబర్ 21వ తేదీ నుంచి నాలుగు లేబర్ కోడ్స్ అమలు చేయాలని ప్రకటించడం కార్మిక హక్కులకు విఘాతం కలిగించే చర్య అని విమర్శించారు. బ్రిటిష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఈ కోడ్స్ ద్వారా తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. వేతనాల కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, సామాజిక భద్రత కోడ్, వృత్తి భద్రత కోడ్ పేరుతో వచ్చిన ఈ చట్టాలు కార్మికులకు మేలు చేస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, వాస్తవానికి ఇవి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. కార్మికుల శ్రమను దోచుకునేందుకు ఈ చట్టాలు ఉపయోగపడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూడా ఎనిమిది గంటల పనిని 10 గంటలకు పెంచే నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమని, ఇది కూడా లేబర్ కోడ్స్లో భాగమేనని విమర్శించారు. సమ్మె హక్కు, ఈఎస్ఐ, పిఎఫ్ వంటి రక్షణ చట్టాలు బలహీనపడే ప్రమాదం ఉందని అన్నారు. కార్మిక, రైతు, ప్రజా సంఘాలు ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో కార్మిక హక్కుల రక్షణ కోసం ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో AITUC పట్టణ అధ్యక్షులు ఓబి నాగరాజ్, కార్యదర్శి వైటి భీమేష్, కె. అజయ్ బాబు, సిపిఐ పార్టీ కార్యవర్గ సభ్యులు సుదర్శన్, ఉపాధ్యక్షులు గిరి మల్లప్ప, ఏఐటీయూసీ జిల్లా సమితి సభ్యులు కల్లుబావిరాజు, వడ్డే రాముడు, లక్ష్మీనారాయణ, దేవా నాగరాజు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News