DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధిపై వచ్చిన ₹50 లక్షల లంచం ఆరోపణలను ప్రభుత్వం సుమోటోగా స్వీకరించి వెంటనే కేసు నమోదు చేయాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు. తన భవనం నిర్మాణానికి అనుమతుల కోసం ఎమ్మెల్యే పార్థసారధి ₹50 లక్షల లంచం డిమాండ్ చేశారని, ఇప్పటికే ₹10 లక్షలు అడ్వాన్స్గా చెల్లించానని టిడిపి సీనియర్ నాయకుడు సౌదీ రౌఫ్ చేసిన ఆరోపణలను ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని ఆయన కోరారు. ఈ అంశంపై నిజ నిర్ధారణ కోసం లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించాలని కూడా డిమాండ్ చేశారు. ఈ విషయంపై రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షిబ్లీ, సంబంధిత మంత్రులు మరియు అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి కార్యక్రమాలను విజన్తో ముందుకు తీసుకెళ్తున్న సమయంలో ఇలాంటి అవినీతి ఆరోపణలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉందని, కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని నూర్ అహ్మద్ పేర్కొన్నారు. అలాగే ఎమ్మెల్యే పార్థసారధి లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమై తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకుడు ప్రసాద్, ఎంహెచ్పీఎస్ నాయకులు షకీల్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News