DNB News - ఆంధ్రప్రదేశ్ / : దేశంలోనే అతిపెద్ద ఉపాధి హామీ పథకమైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించి, ప్రభుత్వం మార్చిన పేర్లను తొలగించాలని సిపిఐ పట్టణ కార్యదర్శి టి. వీరేష్, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు కొత్తూరు గంగన్న డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఏఐవైఎఫ్ కార్యాలయంలో ఏప్రిల్ 10 నుండి 12 వరకు నిర్వహించనున్న పాదయాత్రకు సంబంధించిన గోడపత్రికలను సిపిఐ–బికేఎంయు నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూలీలను బానిసలుగా మార్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మికులకు హామీగా ఉన్న 100 రోజుల పనిని పూర్తిగా అమలు చేయకపోవడం వల్ల, జిల్లా వ్యాప్తంగా 30 రోజులు కూడా పని దొరకని పరిస్థితి నెలకొన్నదని విమర్శించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు రాజకీయ ఒత్తిళ్లకు లోనై పనులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దీంతో వేలాది కుటుంబాలు ఆకలి కష్టాలతో జీవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన గ్రామాలు, వెనుకబడిన మండలాలు, మహిళలు, వృద్ధులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి ప్రజలు, వ్యవసాయ కూలీలు పెద్దఎత్తున ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డిమాండ్లు: జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ 100 రోజుల గ్యారంటీ పని ఇవ్వాలి. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి జాబ్ కార్డులపై జరుగుతున్న అక్రమాలను తక్షణం నిలిపివేయాలి అధికారుల అవినీతి, నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి గ్రామాల్లో జరుగుతున్న బోగస్ పనులపై ప్రత్యేక దర్యాప్తు జరపాలి ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి కే. రమేష్ కుమార్, సిపిఐ మండల కార్యదర్శి బి.జి. ఎల్లప్ప, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వి. సత్యనారాయణ, నియోజకవర్గ కార్యదర్శి బసాపురం గోపాల్, నాయకులు శేషప్ప, ఈరన్న, విజయ్ కుమార్, పుష్పరాజ్, లక్ష్మన్న, లింగప్ప తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News