DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (Public Grievance Redressal System) కార్యక్రమంలో మొత్తం 121 ఫిర్యాదులు స్వీకరించినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ తెలిపారు. అందిన ఫిర్యాదులపై చట్టపరంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సోమవారం కర్నూలు కొత్తపేటలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ఎస్పీ ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాముఖ్యతతో తీసుకుని సంబంధిత పోలీసు అధికారులతో వెంటనే స్పందించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ రోజు అందిన ఫిర్యాదుల్లో ఉద్యోగ మోసాలు, ఆర్థిక మోసాలు, సైబర్ క్రైమ్, కుటుంబ వివాదాలు, ఆస్తి వివాదాలు, బెదిరింపులు వంటి పలు అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగం ఇప్పిస్తానని లక్షల్లో డబ్బులు తీసుకుని మోసం చేసిన ఘటనలు, బ్యాంక్ ఖాతా హ్యాకింగ్ కేసులు, కుటుంబ సమస్యలు వంటి అంశాలపై బాధితులు ఫిర్యాదులు చేశారు. ప్రతి ఫిర్యాదును చట్ట ప్రకారం సమగ్రంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) హుస్సేన్ పీరా, సీఐలు శివ శంకర్, మస్తాన్ వలి పాల్గొన్నారు.
Admin
DNB News