DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాష్ట్రస్థాయి మాస్టర్స్ క్రీడల్లో కర్నూలు పోలీసు క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. ఆంధ్రప్రదేశ్ SAP లీగ్ మాస్టర్స్ క్రీడల్లో పాల్గొని బంగారు, వెండి, కాంస్య పతకాలు గెలుచుకున్న ఆర్ఎస్సై మరియు కానిస్టేబుల్ను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మార్చి 30, 31 తేదీలలో 35–45 సంవత్సరాల వయస్సు విభాగంలో ఈ రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ఆర్ఎస్సై పి.ఆర్. మహేశ్వరరెడ్డి, కానిస్టేబుల్ శివకుమార్ పతకాలు సాధించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో విజేతలు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలవగా, ఆయన మెడల్స్ మరియు శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. పోలీసు విధుల్లో ఒత్తిడి మధ్య కూడా క్రీడల్లో రాణించడం గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లా పోలీసు శాఖకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆర్ఎస్సై పి.ఆర్. మహేశ్వరరెడ్డి 800 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం, 1500 మీటర్ల పరుగు పందెంలో వెండి పతకం సాధించారు. గత ఐదేళ్లుగా మాస్టర్స్ అథ్లెటిక్స్లో పాల్గొంటూ చెన్నై నేషనల్ మీట్లలో కూడా ప్రతిభ కనబరిచారు. కానిస్టేబుల్ శివకుమార్ (కర్నూలు ట్రాఫిక్ పీఎస్) లాంగ్ జంప్లో కాంస్య పతకం సాధించారు. గతంలో సౌత్ జోన్ నేషనల్స్, కేరళ జూనియర్స్ నేషనల్స్తో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి పోటీల్లో కూడా ప్రతిభ చాటారు. వీరిద్దరూ జాతీయ స్థాయి క్రీడల్లో కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ జావేద్, మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పాండురంగారెడ్డి, కార్యదర్శి రవికుమార్ పాల్గొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయం – కర్నూలు
Admin
DNB News