DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణ శివారు మండగిరి ప్రాంతంలో ఉన్న సర్వే నంబర్ 630/Aలో రస్తా పొరంబోకు భూమిగా గుర్తించిన స్థలంపై తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. సుమారు 15 రోజుల క్రితం ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి సంబంధిత అధికారులతో కలిసి ఆ భూమిపై హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసి, ప్రభుత్వ భూమిని కాపాడాలని స్పష్టం చేశారు. అయితే, ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు ఆ హెచ్చరిక బోర్డును ధ్వంసం చేయడం సంచలనానికి దారి తీసింది. ఈ ఘటనతో ప్రభుత్వ భూముల రక్షణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా, అక్రమార్కులతో లోపాయికార ఒప్పందాలు కుదిరాయన్న ఆరోపణలు వినిపిస్తూ రాజకీయ వర్గాల్లో చర్చలు వేడెక్కుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వ భూములను రక్షిస్తున్నామని చెబుతుండగా, మరోవైపు డీల్ రాజకీయాలు జరుగుతున్నాయా అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన వెనుక అసలు కారణం ఏమిటి? బోర్డు ధ్వంసానికి బాధ్యులు ఎవరు? అనే ప్రశ్నలు ప్రజల్లో నెలకొన్నాయి. వెంటనే ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, నిజాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో అధికారులు కఠిన చర్యలు తీసుకుని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
Admin
DNB News